శ్రీ శివాయ గురవే నమః
“అభినవ కాళిదాస” శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి గారి
శ్రీ ఉమా మహేశ్వర సుప్రభాతం -(24-04-17)
అనువాదకుడు ; డా.తాడేపల్లి పతంజలి


అర్ఘాయతే సురసరిజ్జల పూర్ణకుంభ
కల్పప్రసూన హరిచందన వస్తుహస్తాః
సప్తర్షయస్సముదితాశ్చసమాసతే ౽ త్ర
శ్రీ మన్మహేశ్వర! విభో! తవసుప్రభాతం ! 9



తాత్పర్యము

ఓ పరమశివా ! నిన్ను పూజించుటకొరకు ఆకాశగంగలోని నీటితో నింపబడిన పూర్ణకుంభములతో
కల్పవృక్షపు పూలతో , పసుపు వన్నెగల చందనముతో , రకరకాల పూజాద్రవ్యములు నిండిన చేతులతో
నీపూజయందు సంతోషము కలిగిన సప్తర్షులు ఇక్కడ ( శ్రీశైలములో) కూడియున్నారు. సంపద కలిగిన పరమశివా ! ప్రభూ! నీకు శుభోదయం.

విశేషాలు

పూర్ణకుంభము

నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేక రాగి పాత్రను నీటితో గానీ బియ్యముతో గానీ నింపినప్పుడు “పూర్ణకుంభము” అంటారు. పాత్ర మొదట్లో మామిడి ఆకులు; వాటి పైన కొబ్బరి కాయ ఉంచి. తెలుపు లేక ఎరుపు దారం చుడతారు.. సృష్టికి ప్రతీకలు ఆకులు, కొబ్బరికాయలు. సృష్టిలో అన్నింటినీ బంధించే 'ప్రేమ'కు సంకేతం దానికి చుట్టబడిన దారము . రాక్షసులు, దేవతలు క్షీర సముద్రాన్ని మధించినపుడు అమృత కలశంతో దేవదేవుడు కనబడ్డాడు. . కనుక ఈ 'కలశం' లేదా పూర్ణ కుంభం అమృతత్వాన్ని, శుభాన్ని సూచిస్తుంది కనుక కనుక “ పూర్ణ కుంభ స్వాగతం” ఏర్పడింది.

సప్తర్షులు

మరీచి, అంగిరసుడు, పులహుఁడు, వసిష్ఠుడు, అత్రి, పులస్త్యుడు, క్రతువు అనువారు సప్తర్షులు అని కొంతమంది, కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, వసిష్ఠుడు సప్తర్షులు అని ఇంకొందఱు చెబుతారు.

Comments

Popular Posts