తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి సంస్కృత సాహిత్య సౌరభం

      మహబూబ్ నగర్ జిల్లా కోడేరు మండలం రాజాపురం గ్రామానికి చెందిన తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి సంస్కృత కవి,పండితుడు,పండిత ప్రకాండుడు.జ్ఞాన సముపార్జనకోసం ఉత్తమమైన గురువులను అన్వేషిస్తూ ,వారిని సేవిస్తూ అనేక విషయాలలో పట్టును సాధించాడు . కవితా కాంతా స్వయంవరం  నుండి "రవీంద్ర తపః ఫలం " వరకు పదిహేనుకుపైగా రచనలు చేశాడు .వ్యాకరణం ,సాహిత్యం ,వేదం ,ఆయుర్వేదం , జ్యోతిష్యం,ధర్మశాస్త్రాలలో పాండిత్యం సముపార్జించిన తెలంగాణ తల్లి ముద్దు బిడ్డడు .తన అచ్చ మైన  తెలంగాణ యాసతో మాట్లాడుతూ స్నేహితులతో "నైజాం శాస్త్రి" అని పిలిపించుకున్నవాడు.కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు గీత గోవిందాన్ని బోధించిన ఉత్తమ గురువు.1902 లో పుట్టిన శాస్త్రిగారు 1990 లో మరణించాడు .అద్భుతమైన సంస్కృత భక్తి సాహిత్యాన్ని సృజించిన శాస్త్రి విమర్శకులను సైతం మెప్పించి అభినవ కాళి దాస ,కవికుల తిలక ,సాహిత్య కల్పదృమ ,అలంకార నటరాజ బిరుదములను అందుకున్నాడు. 

          తెల్కపల్లి వారు కల్పనతో సృష్టించిన తొలి కావ్యం కవితా కాంతా స్వయంవరం .ఇందులోని ఒక పాత్ర "కవిత".ఆమె వరుని ఎంపిక శాస్త్రి హృదయ దర్పణంగా భావించాలి.ఈ కావ్యం ద్వార లోకజ్ఞానం ,వాదించడానికి వెనుకాడని ధీరత ,ముఖంలో తేజస్సు,మనసులో వివేకం ఉనా ప్రేమికులకే కవిత్వం సాధ్యపడుతుందని ,పాట దానితో కలిసి నడుస్తుందని ప్రతీకాత్మకంగా వర్ణించారు .ఇది 55 ఆర్యావృత్తాలతో కూడిన ఖండ కావ్యం .దీనిలో శాస్త్రిగారి అభిరుచి ,స్వీయ సామర్థ్యం ,సరస కవితా చాతుర్యం మనకు కనబడుతున్నది..శాస్త్రాలను చదివి గర్వించే పండితులకంటే పరిమిత శాస్త్ర జ్ఞానం పొంది కవితల్లో నైపుణ్యమును సంపాదించిన కవిలోకంలో ఆదరాభిమానాలను పొందుతాడన్న భావాన్ని ధ్వనింప చేయడాన్ని మనమంతా గమనించాలి .

             "శ్రీ లలితాస్త్వఝరీ " శాస్త్రిగారి భక్తి శైలమునుండి ప్రవహించిన  కవితా  రస ప్రవాహం.ఈ కావ్యములో వీరు కరుణామూర్తియైన లలితాంబను,శారదను పొగిడిన తీరును అనుసరించి వీరికున్న వ్యాకరణ వేదాంత శాస్త్ర పరిచయాన్ని మనం అంచనా వేయవచ్చు.శ్రీ లలితాంబయొక్క  శరీర కాంతి ,బాలసూర్యుని వలె ,పగడపు తీగగా ,సింధూర కణిక ,పద్మరాగ మణుల ప్రభగా వీరు వర్ణించడం బాగుంది .

             లలితాంబిక తేజస్సును చూస్తున్న మునులకు చూడదగింది మరొకటిలేదని,తేజస్సును తెలుసుకున్నవారికి తెలుసుకోదగింది మరొకటి లేదని ,చిదానంద స్వరూపమైన ఆ జ్యోతిని చేరిన వారికి మరొక గమ్యస్థానం లేదని శాస్త్రిగారు భావించడం వారి భక్తి భావాన్ని ,అద్వైత సిద్ధాంత పరంపరాజ్ఞానాన్ని  తెలుపుచున్నవి .లలితాంబికా దేవి చిరునవ్వును తన కన్నులయందు పచ్చకర్పూరమై ఉండి చల్లదనం చేకూర్చునదిగా ,తనకు సుఖములనిచ్చేదిగా భావించారు.ఈ శ్లోకములో వాడిన చంద్రన్,కుందన్,ముక్తాహారన్ ,కర్పూరన్ అను పదాలు వారి వ్యాకరణ శాస్త్ర పాండితిని వెల్లడి చేస్తున్నవి.మమకార జ్వరపీడితమై ఏడుస్తున్న తన మనస్సనే శిశువును లలితాంబిక పాదాలనే ఉయ్యాలపై వేసుకొని ఓదార్చమని ,సుఖాన్ని ఇవ్వమని ప్రార్థించుటలో భక్థిరసం ఉప్పొంగుతున్నది.

           ధ్వని పూర్వక పద ప్రయోగాలతో ,అన్ని అలంకారాలు తొడుగుకున్న గుణాలతో వెలుగులు చిమ్ముతూ,రసాలతో నిండిన సుకవి రచించిన కావ్యం లాగా మంచి ప్రవ్రతనగల ప్రపంచంలో సరస్వతి వెలుగోందాలని "శ్రీ శారదా స్తుతి శతకం"లో తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి కోరుకున్నారు.ఇందులో మంచికావ్య లక్షణాలను,మంచి లోకపులక్షణాలను పేర్కొన్నాడు. దుర్గ,లక్ష్మి,సరస్వతులతో పాటు సావిత్రి,రాధలను కూడా చేర్చి ఐదు ప్రకృతులను వర్ణించి పూర్ణభావన చేశాడు .శక్తి ,సంపద ,విద్యలకు ధర్మము,ప్రేమ చేర్చడమనేది ఒక మధుర భావన.

 శ్రీ రామచంద్ర శాస్త్రిగారు శ్రీ శారదా దేవిని చిత్స్వ రూపిణిగాను,త్రిలోకమాతగాను,త్రిపురసుందరిదేవిగాను ఎన్నెన్నో భావనలతో తన ఆత్మనందు సాక్షాత్కరించుకొని ఈ స్తుతిని రాశారు..శృంగేరి పీఠం యొక్క అధిష్థాన దేవతయైన  శారదాదేవి వర్ణననే శ్రీ శారదా స్తుతి శతకం .ఈ శతకం ఆర్యావృత్తములలో నడిచింది. పద్యాలలో ప్రాసనియమం పాటించబడింది.భావములోను ,భాషలోను యెంతొ పరిణతి కలిగి ఆనందాన్ని కలిగిస్తూ మూకమహాకవి ఆర్యా శతకాన్ని తలపిస్తున్నది.

       తెల్కపల్లి రామచంద్ర శాస్త్రిగారి విమర్శనాగ్రేసరతుకు గీటురాయిగా "శ్రీ గురుపీఠ తత్వ దర్శనం" నిలుస్తుంది.దీనిని రాయడానికి ఆయన కాశీ పూనా పట్టణాలలో ఉన్న గ్రంథాలయాలను సందర్శించాడు.శ్రీ మదాద్య శంకర భగవత్పాదులు శుద్ధస్ఫటిక చంద్ర మౌళీశ్వర  లింగాన్ని శ్రీ కాంచీ పీఠ మందుంచినారని నిర్ణయించుట వారి శేముషీ వైభావానికి నిదర్శనం .

           దైనందిన ప్రళయరూపమగు సుషుప్తినుండి జగత్తు మేల్కొని చేతనను పొందుతున్నదని ,యోగనిద్రను విడిచి మేల్కొనమని "శ్రీమదుమామహేశ్వర సుప్రభాతం"లో ఈశ్వరుడిని కోరారు.ఈ సుప్రభాతములో వీరిశివభక్తి పరాకాష్టను పొందింది.సప్తఋషులు ,గంగాజల పూర్ణకుంభములతోను,కల్పవృక్ష పుష్పాలతోను,హరిచందనాది వస్తు సామాగ్రితోను పూజించుటకు వచ్చారని ,మహేశ్వరుణ్ణి లెమ్మన్న చక్కని ఊహ ఇందులో కనబడుతుంది .

            స్తోత్రములకు గూడా శాస్త్రి గారు కావ్యరూపం కల్పించారు.దాదపు 40 సంవత్సరాల కిందట "భజే కృషణవేణీం" పేరిట కృష్ణా నదీ స్తుతిని రాశాడు.కృష్ణవేణీ పుట్టుపూర్వోత్తరాలనుండి ఆ నదికి వచ్చే పుష్కరాలవరకు అనేక విషయాలను ఈ స్తుతియందు వర్ణించాడు.ఇది భుజంగ ప్రయాత వృత్తంలో రాయబడింది.పూజావిధానం ,కృషణవేణి గొప్పదనం ఈస్తుతిలో మనకు కనబడుతాయి .తెలంగాణ నేలను పునీతం చేస్తూ ప్రవహిస్తున్న పావన జీవ ధారయైన  కృష్ణా నదీమ తల్లి పై ఇంత అందమైన స్తుతి మరొకటి కనబడదు.సహ్యాద్రి నుండి సాగరం వరకు సాగే కృష్ణవేణీ  ప్రవాహాన్ని,దాని గంభీర గమనాన్ని రమణీయ అలంకారాలతో కమనీయంగా చెప్పిన కవితా ప్రవాహమే "భజే కృష్ణవేణీం " స్తుతి.ఈ స్తుతితో పాటు కంచీ పరమాచార్య్ల స్తుతి,జయేంద్ర సరస్వతీ స్తుతి,అభినవ విద్యా తీర్థ స్తుతి,శ్రీ వేంకటేశ్వర పంచ రత్న స్తుతి,బాసర సరస్వతీ స్తుతి,కంచి కామాక్షి పంచరత్న స్తుతులవంటివి ఎన్నో శాస్త్రి గారి కలం నుండి జాలు వారినవి .శ్రీ లక్ష్మీ నృసింహ సుప్రభాతం,శ్రీ బీచుపల్లి హనుమత్సుప్రభాతం ,హయగ్రీవశతకంలను గూడా రాశారు.

          మహబూబ్ నగర్ జిల్లాలోని అనేక సంస్థానాలలో సత్కారాలు,సన్మానాలు పొందారు.1979 లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ఉత్తమ సంస్కృత విద్వాంసులుగా సత్కరింపబడ్డారు.వద్రంగం,కుమ్మరం ఒంటబట్టించుకొని అనేక కళాఖండాలను తీర్చి దిద్దిన బహుముఖ ప్రజ్ఞా శాలి.ఆయుర్వేద వైద్యునిగా ,గ్రామ సర్పంచ్ గా సామాన్య జనానికి చేసిన సేవ వెల కట్టలేనిది.

         అమృతాన్ని తృణీకరించే వాక్కుతో ,కమలాలను వణీకించే పాదకాంతితో కలువలను సిగ్గుపడేటట్లు చేసే చిరునవ్వు సొగసుతో లలితాదేవిని తన యెదుట సాక్షాత్కరించమని వేడుకొనే శ్లోకంలో వీరిభావుకత కొత్తపుంతలు తొక్కింది.ఉపమ,రూపకాలను మించిన నవాలంకారం కూర్చిన ఈ కవి ప్రతిభ వెలుగులు విరజిమ్మింది.సంస్కృతంలో ఇంత బలంగా రాయగలిగిన శ్రీ తెల్కపల్లి రామచంద్ర శాస్త్రి తెలంగాణాకు గర్వకారణం .

-సంబరాజు రవిప్రకాశ రావు.
9491376255


Comments

Popular Posts